chavai
చావడి
చావడి అంటే గ్రామప్రజలు సమావేశమయ్యే ప్రదేశము, ప్రభుత్వ కార్యాలయము లేదా గ్రామమునకు సంబందించిన దస్తావేజులు భద్రపరిచే ప్రదేశము. బాబా మహాసమధి చెందిన తరువాత సంస్థానము వారు ఈ ప్రదేశములో పుస్తకములు భద్రపరచడానికి మరియు యాత్రికుల వసతికి ఉపయోగించారు. 1930 సం|| తరువాత చావడిని బాబా గుడిగా తీర్చిదిద్దారు.
ఒకరోజు పెద్ద వర్షమొచ్చి, మసీదు అంతా తడిసిపోయీ బాబాకు కూర్చునేందుకు చోటుగూడ లేకపోయింది. భక్తులాయనను నాటి రాత్రికి చావడిలో ఉండమన్నారు. ఆయన అంగీకరించకపోయేసరికి పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకుపోయారు. ఆ రాత్రి బాబా అక్కడ విశ్రమించారు. అప్పటినుండి బాబా ఒక రాత్రి మసీదులోను, ఒకరాత్రి చావడిలోనూ నిద్రించేవారు.
బాబా ఎప్పుడైతే చావిడిలో నిద్రించడం మొదలుపెట్టారో అప్పటినుండి శేజ్ ఆరతి ఇవ్వడం మొదలు పెట్టారు. తరువాత బాబా చావడిలో నిద్రనుంచి మేల్కొనగానే కాకడ ఆరతి ఇచ్చేవారు. మసీదు మరమత్తులు చేసిన తరువాత మధ్యాహ్న ఆరతి మరియు సంధ్య ఆరతి మొదలుపెట్టారు.
బాబా భక్తుడైన అన్నాచించినీకర్ దంపతులకి 50 సం||లు దాటినా సంతానము కలుగలేదు. ఒకనాడు శ్యామా, “బాబా! నీవెందరి కోరికలో తీరుస్తున్నావుగాని, వీరింతగా సేవిస్తున్నా ఒక్క బిడ్డను గూడ ప్రసాదించవేమి?” అన్నాడు. బాబా నవ్వి, “నన్ను నిజముగా కోరితే ఎప్పుడైనా తీర్చకుండా వున్నానా? ఏమి తెలియనివాడిలా మట్లాడతావేం? వీరేమి అడగలేదు. వీరికి కొడుకును ప్రసాదించినా ఒక్క తరంకంటే వీరి వంశం నిలవదు. అంతకంటే కలకాలం కొనసాగే వంశప్రతిష్ట ప్రసాదిస్తాను” అన్నారు. ఆయన భావమెవరికీ అర్థంకాలేదు. అన్నాకొక కోర్టు వ్యాజ్యం 3 సం||లు నడిచింది. కొద్ది నెలలు తరువాత కోర్టువారు అన్నాకు అనుకూలముగా రూ. 1800/- ల డబ్బు జమ చేసారు. అన్నా ఆ పైకమంతా చావడి మరమత్తుకు వినియోగించాడు. అందుకే చావడికి వెళ్ళే ముందు పైన “లక్ష్మీబాయి దామోదర్ బాబరే” అని ఆ దంపతుల పేర్లుంచారు.
గుజరాత్ లోని నౌసరి గ్రామమునకు చెందిన అంబారామ్ చావడిలోనున్న పెద్ద బాబా చిత్రపటమును గీసినాడు. 1953 సం||లో బాబా అతనికి కలలో దర్శనము ఇచ్చి చిత్రపటమును తాకి అతనిని ఆశీర్వదించారు. అప్పటికి అంబారామ్ వయస్సు 18 సంవత్సరములు. నౌసరి గ్రామప్రజలు చందాలు వసూలు చేసి బాబా చిత్రపటమును కొని షిరిడికీ తీసుకొని వచ్చిరి.
బాబా చిత్రపటము ఎడమవైపు 4 అడుగుల ఎత్తుగల కొయ్యబల్ల వుంది. బాబా బౌతికంగా సమాధి చెందిన తరువాత ఈ కొయ్యబల్లపై బాబా దేహమునకు స్నానము చేయించబడినది. ప్రతి గురువారము ఉరేగింపుతో తీసుకొచ్చిన పల్లకిని చావడి బయట కొయ్య బల్ల మీద నుంచుతారు. అక్కడే చిన్న చక్రముగల కుర్చి వుంది. బాబా ఉబ్బసముతో బాధపడుతున్నప్పుడు భక్తులు సమర్పించుకున్నారు. కాని బాబా దానిని ఎప్పుడు వాడలేదు. చావడి కుడివైపు భాగమున బాబా కాలుమీదకాలు వేసుకున్న చిత్రపటము వుంది. చిత్రపటము చుట్టూ వెండితాపడము చేసి వుంది. ఈ చిత్రపట్టాన్ని పల్లకి ఊరేగింపుతో మసీదు నుంచి చావడికి తీసుకొనివస్తారు. ఇందులో కేవలము పురుషులకు మాత్రమే ప్రవేశము ఆడవాళ్ళకు ఇక్కడ ప్రవేశము లేదు. ఈ ఆచారము బాబా వున్నప్పుడు నుంచి జరుగుతుంది.
చావడి తెరిచి ఉండే సమయము 04.00 A.M 9.00 P.M.