ఈ యుపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది యాత్మసాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక నెవరయితే యాత్మసాక్షాత్కారము పొందియున్నారో యట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్ప గలరని అతడు భావించెను. ఎవరును దీనికి తగిన సమాధానము నివ్వనపుడు దాసుగణు సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశము దొరికినప్పుడు షిరిడీకి పోయి సాయిబాబాను కలిసి, వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తులోని కష్టముల జెప్పి, సరియైన యర్థము చెప్పుమని వారిని వేడుకొనెను. సాయిబాబా యాశీర్వదించి యిట్లనెను. “నీవు తొందర పడవద్దు. ఆ విషయములో నెట్టి కష్టము లేదు. కాకాసాహెబు దీక్షితుని పనిపిల్ల తిరుగుప్రయాణములో నీ సందేహమును విలీపార్లేలో తీర్చును.” అప్పుడక్కడ నున్న వారు దీనిని విని, బాబా తమాషా చేయుచున్నారని యనుకొనిరి. భాషాజ్ఞానములేని పనిపిల్ల ఈ విషయమెట్లు చెప్పగల దనిరి. కాని దాసుగణు ఇట్లనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కు లనుకొనెను.